ఏపీ మద్యం కుంభకోణం కేసు... ఏడున్నర గంటల పాటు విజయసాయిరెడ్డి విచారణ

  • బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో విచారించిన అధికారులు
  • మద్యం పాలసీ కేసుతో తనకు సంబంధం లేదన్న విజయసాయిరెడ్డి
  • రాజ్ కెసిరెడ్డి పేరు తప్ప తాను ఎవరి పేరు చెప్పలేదని వెల్లడి
ఏపీ మద్యం కుంభకోణం కేసులో రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డిని ఈడీ సుమారు ఏడున్నర గంటల పాటు విచారించింది. బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయంలో అధికారులు ఆయనను విచారించారు. విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, మద్యం పాలసీ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. తాను ఎవరి పేర్లను అధికారులకు చెప్పలేదని వెల్లడించారు.

మద్యం కుంభకోణానికి సంబంధించిన విషయాలన్నీ రాజ్ కెసిరెడ్డికి మాత్రమే తెలుసని చెప్పానని వెల్లడించారు. కేసు దర్యాప్తులో భాగంగా గతంలో సీజ్ చేసిన మొబైల్ ఫోన్‌లలోని వివరాలను ఈడీ అధికారులు సేకరించారని తెలిపారు. లోపల ప్రశ్నలు, విచారణలు పెద్దగా ఏమీ జరగలేదని పేర్కొన్నారు. తన ఫోన్‌లోని డేటా ట్రాన్స్ ఫర్ కోసం పిలిచినట్లు చెప్పారు. వారికి అవసరమైన సమాచారం తన ఫోన్‌లో ఉంటుందనే ఉద్దేశంతో ఆ డేటాను తీసుకున్నట్లు చెప్పారు.

మద్యం పాలసీ కుంభకోణం ఎలా జరిగింది, ఏం జరిగిందనే విషయాలు తెలిసిన వ్యక్తి రాజ్ కెసిరెడ్డి మాత్రమే అన్నారు. ఇప్పటి వరకు తాను ఆయన ఒక్కరి పేరు తప్ప ఎవరి పేరునూ చెప్పలేదని అన్నారు. సిట్ అధికారులకైనా, ఈడీ అధికారులకైనా తాను ఇదే విషయం చెప్పానని అన్నారు. తనను ఎవరు లక్ష్యంగా చేసుకున్నా భయపడే వ్యక్తిని కాదని వ్యాఖ్యానించారు. తిరుమల వెంకన్న సాక్షిగా తాను ఎలాంటి తప్పు చేయలేదని విజయసాయిరెడ్డి అన్నారు.

Vijayasai Reddy
AP Liquor Policy Case
ED Investigation
Raj Kasireddy
YSRCP
Andhra Pradesh

More Telugu News